'అమ్మఒడి' తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
- బహిరంగ ప్రదేశాల్లో శిశువులకు పాలు పట్టే సమయంలో ఇబ్బంది పడుతున్న తల్లులు
- కాచిగూడ బస్ టెర్మినల్లో తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సీతక్క
- రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి
- దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. దత్తత తీసుకోవాలనుకునే వారు అధికారికంగా ఐసీడీఎస్ (ICDS)ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో శిశువులకు పాలు పట్టే సమయంలో తల్లులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, కాచిగూడ బస్ టెర్మినల్లో 'అమ్మఒడి' తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సూచనలు చేశారు.
ఇలాంటి 'అమ్మఒడి' తల్లిపాల ఫీడింగ్ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. ముఖ్యంగా సమ్మక్క-సారలమ్మ జాతర వంటి భారీ జనసమూహాలు ఉండే చోట కూడా తల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.